26 Aug,2017

'దర్పణం' మూవీ షూటింగ్‌ ప్రారంభం 

వి. చిన శ్రీశైలం యాదవ్‌ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌(వెంకట్‌ యాదవ్‌) నిర్మించనున్న చిత్రం 'దర్పణం'. ఈ చిత్రం షూటింగ్‌ హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. తనిష్క్‌ రెడ్డి, అలెక్సియస్‌, సుభాంగి పంత్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి పూజా కార్యక్రమాలు చిన శ్రీశైలం యాదవ్‌ నిర్వహించగా, పరుచూరి వెంకటేశ్వరరావు మొదటి సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. దర్శకుడు ఎన్‌. శంకర్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ ఎమ్‌ఐఎమ్‌ నాయకుడు నవీన్‌యాదవ్‌, ప్రముఖ రచయిత శివశక్తిదత్తా, దర్శకుడు ఢమరుకం శ్రీనివాసరెడ్డి, కాదంబరి కిరణ్‌, కొమరం వెంకటేష్‌, బందరు బాబీ, కెమెరామెన్‌ ప్రభాకరరెడ్డి, అపూరూప్‌(శివ) తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో 

నటుడు కాదంబరి కిరణ్‌ మాట్లాడుతూ..'హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ ఇంత స్టాంగ్‌గా ఉండటానికి ప్రధాన కారణాలలో చిన శ్రీశైలం అన్న కూడా ఒకరు. ఆయన పేరే ఒక చరిత్ర. ఇక్కడ కార్మికులకు అండగా ఉంటూ, నిర్మాతలకు, దర్శకులకు తన వంతు సహాయ సహకారం అందిస్తున్నాడు. ఆయన కొడుకులిద్దరూ నవీన్‌ మరియు ప్రవీణ్‌ యాదవ్‌లు తెలుగు చిత్ర పరిశ్రమలో నాయకత్వం వహిస్తూ, యూత్‌ అందరికీ ఆదర్శవంతంగా ఉన్నారు. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌ నిర్మాతగా ఈ సినిమా ప్రారంభం కావడం శుభదాయకం. అలాగే తనీష్క్‌రెడ్డి బాలనటుడిగా సుపరిచితుడు. ఈ చిత్రం హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. 

చిత్ర నిర్మాత ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..'దర్పణం నా మొదటి చిత్రం. ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. దర్శకుడు రామకృష్ణ కథ చెప్పిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి ప్రేమకథ. షూటింగ్‌కి ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ సినిమాను పూర్తి చేయనున్నాం...' అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో నవీన్‌ యాదవ్‌, ఆర్టిస్ట్‌ మహేష్‌, సంగీత దర్శకుడు సిద్దార్ద్‌ సదాశివుని, సహనిర్మాత కేశవ్‌ దేశాయ్‌లతో పాటు హీరో హీరోయిన్లు పాల్గొన్నారు. 

తనిష్క్‌ రెడ్డి, అలెక్సియస్‌, సుభాంగి పంత్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్ధ్‌ సదాశివుని, కెమెరా: సతీష్‌ ముత్యాల, స్టంట్స్‌: మల్లేష్‌, ఎడిటర్‌: ఈ.ఎస్‌. ఈశ్వర్‌, పి.ఆర్‌.ఓ.: బి.వీరబాబు, సహనిర్మాతలు: కేశవ్‌ దేశాయ్‌, క్రాంతి కిరణ్‌ వెల్లంకి, నిర్మాత: వి. ప్రవీన్‌ కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌ యాదవ్‌), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి. రామకృష్ణ. 

Recent News